ఈ నెలాఖరుకల్లా వైద్య పోస్టులు భర్తీ   | Sakshi
Sakshi News home page

ఈ నెలాఖరుకల్లా వైద్య పోస్టులు భర్తీ  

Published Fri, Feb 4 2022 3:09 AM

CM Jagan review Medical and Health Department Replacing medical posts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ ఫిబ్రవరి చివరినాటి కల్లా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే 27 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 12 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ నెలాఖరు కల్లా ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాలతో సహా ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులన్నీ భర్తీ చేయాలన్నారు.

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. డాక్టర్లు గిరిజన ప్రాంతాల్లోనే ఉంటూ వైద్య సేవలందించేందుకు అధికారులు ఎలాంటి ప్రతిపాదనలు అందచేసినా గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తానని సీఎం ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్న అంశంపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ఆమోదిస్తామని చెప్పారు. కోవిడ్, వ్యాక్సినేషన్, ఖాళీల భర్తీపై సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

ఆ మాటే వినిపించకూడదు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పులు స్పష్టంగా కనిపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాటే వినిపించకూడదన్నారు. నాడు – నేడు ద్వారా చేపట్టిన పనులతో పాటు వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని  స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని), వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు తదితరులు సమీక్షకు హాజరయ్యారు.
 

కోవిడ్‌ తీవ్రత తగ్గుముఖం
► అన్ని రాష్ట్రాల్లోనూ ఆంక్షల సడలింపు
► రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 1,00,622 
► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు 2,301 మంది మాత్రమే
► ఐసీయూలో ఉంటూ కోలుకుంటున్నవారు 263 మంది. 
► 2,144 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య చికిత్స 
► 104 కాల్‌ సెంటర్‌కు కాల్స్‌ గణనీయంగా తగ్గుముఖం. బుధవారం వచ్చిన కాల్స్‌ 246. ఆస్పత్రిలో చేరినవారు 18 మంది.
► ముమ్మరంగా వ్యాక్సినేషన్‌. రెండు డోసులు తీసుకున్నవారు 3,73,71,243 మంది. ఒక డోసు తీసుకున్న వారు 55,38,556 మంది.
► ప్రికాషన్‌ డోస్‌ లక్ష్యం 12,60,047 కాగా ఇప్పటివరకు 9,79,723 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి
► రాష్ట్రంలో 15 – 18 ఏళ్ల వయసు వారందరికీ మొదటి డోసు పూర్తి

Advertisement
Advertisement