ఉక్కు రాష్ట్రంగా ఏపీ | CM Chandrababu Naidu inaugurates Rayalaseema Steel Plant work | Sakshi
Sakshi News home page

ఉక్కు రాష్ట్రంగా ఏపీ

Jul 4 2026 3:54 AM | Updated on Jul 4 2026 3:54 AM

CM Chandrababu Naidu inaugurates Rayalaseema Steel Plant work

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌తో రాయలసీమకు నవశకం 

రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 

సాక్షి ప్రతినిధి, కడప/­కుప్పం రూరల్‌ / శాంతిపురం: పరిశ్రమలు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌తో రాయలసీమకు నవశకం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు చెప్పారు. రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం సహా, ఆర్సెలార్‌ మిట్టల్, వైజాగ్‌ స్టీల్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఉక్కు రాష్ట్రంగా మారుతోందన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో శుక్రవారం జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 

జేఎస్‌డబ్ల్యూ చైర్మన్, సీఎండీ సజ్జన్‌ జిందాల్, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మలతో కలి­సి ప్లాంట్‌ పనులకు సీఎం శ్రీకారం చు­ట్టారు. సీమ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు అనుబంధంగా నిర్మిస్తున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్‌ క్యాప్టి­వ్‌ పవర్‌ ప్రాజెక్టు పనులనూ ప్రారంభించారు. జ­­మ్మ­లమడుగు నుంచి విజయనగరం జిల్లాలోని జేఎస్‌­డబ్ల్యూ పారిశ్రామిక పార్కును కూడా సీఎం వ­ర్చువల్‌గా ప్రారంభించారు. సీఎం ఏమన్నారంటే..   

సీమలోని ముడి ఖనిజాన్నీ ప్లాంట్‌కు ఇచ్చేందుకు సిద్ధం 
రాయలసీమలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం గురించి దశాబ్ద కాలం పాటు ఎదురు చూశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేరింది. విభజన తర్వాత ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, అనుమానాలను దాటుకుని రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభించాం. పూర్తిగా గ్రీన్‌ ఎనర్జీతో ఉక్కు ఉత్పత్తి చేస్తారు. అనకాపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. జేఎస్‌డబ్ల్యూ బళ్లారి ప్లాంట్‌ కంటే అధిక సామర్థ్యంతో రాయలసీమ ప్లాంట్‌ను తీర్చిదిద్దాలి. సీమ ప్రాంతంలో ఉన్న అత్యంత నాణ్యమైన ముడి ఇనుము ఖనిజాన్ని కూడా ప్లాంట్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.   

మరింతగా విస్తరిస్తాం: సజ్జన్‌ జిందాల్‌ 
ఏడాదికి 2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో నిర్మితమవుతున్న రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ను మరింతగా విస్తరిస్తామని జిందాల్‌ సౌత్, వెస్ట్‌ లిమిటెడ్‌ చైర్మన్, సీఎండీ సజ్జన్‌ జిందాల్‌ చెప్పారు. రాయలసీమ స్టీల్‌ ప్లాంట్, నియో ఎనర్జీ ప్లాంట్, విజయనగరం పారిశ్రామిక పార్కు పనులను ప్రారంభించాక ఆ­యన మాట్లాడారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ తరఫున రూ.50 వేల కోట్ల మేర ఏపీలో పెట్టుబడులు పెడతామని, వీటితో 50 వేల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పారు.

అమరావతి సరే.. మద్దతేది!   
మూడు రాజధానులు అన్నారు.. తర్వాత మావిగన్‌ అంటున్నారు.. రేపు ఏం అంటారో తెలీదు. నేను అడుగుతున్నా.. మన రాజధాని అమరావతా కాదా? మన రాజధాని అమరావతి.. అని గట్టిగా చెప్పండి.. అంటూ సీఎం చంద్రబాబు గట్టిగా పదే పదే కోరినా సభికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం ప్రభుత్వ పెద్దలను నిరుత్సాహానికి గురి­చేసింది. 

కాగా, రక్షణ రంగంలో కీలకమైన ఐదో తరం ఫైటర్‌ జెట్‌ విమానాలు భవిష్యత్తులో రాయలసీమ నుంచే ఉత్పత్తి అవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం పొగురుపల్లి వద్ద వివిధ పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పం గ్రానైట్‌కు భారీగా డిమాండ్‌ ఉండడంతో రూ.15 కోట్లతో హెరిటేజ్‌ గ్రానైట్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement