సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుంది. నాడు-నేడు స్కూళ్ల కోసం విరాళాలు వసూలు చేయాలని నిర్ణయించింది. విరాళాలు వస్తేనే స్కూళ్లు అభివృద్ధి చేయాలని.. విరాళాలు కోసం ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణకి ప్రత్యేక డోనార్ పోర్టల్ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలకు ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఇక దాతల దయపైనే పేద పిల్లల పాఠశాలల భవిష్యత్ ఆధారపడి ఉంది.
మరోవైపు, రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి దిగజారిపోతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాటు, బడి బయటి పిల్లలను సైతం పట్టించుకోక పోవడంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లల్లో అడ్మిషన్లు పెరగడం గమనార్హం. విద్యా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంస్కరణలను చంద్రబాబు సర్కార్ ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. నిర్వీర్యం చేస్తూ వస్తోంది.
రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్లు 15.50 శాతం, యూపీ స్కూళ్లల్లో 3.70 శాతం, ప్రాథమిక పాఠశాలల్లో 1.4 శాతం పెరిగింది. ఇదే క్రమంలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) నమోదు కూడా దిగజారినట్టు యూడైస్ ప్లస్ నివేదికలు చెబుతున్నాయి. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26)లో ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని అనేక సంస్కరణలను అమలు చేసింది. వేల కోట్ల నిధులను వెచ్చింది. వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేలా ప్రణాళికను అమలు చేసింది. సర్కారు బడుల నిర్వహణలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి, చంద్రబాబు సర్కార్కి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.


