అమరావతి భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లు | Chandrababu Govt Another Scam Capital Amaravati govt buildings construction | Sakshi
Sakshi News home page

అమరావతి భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లు

May 1 2026 4:57 AM | Updated on May 1 2026 4:57 AM

Chandrababu Govt Another Scam Capital Amaravati govt buildings construction

అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్‌ రింగ్, అప్రోచ్‌ బ్రిడ్జిలకు మరో రూ.798 కోట్లు

పరిపాలన అనుమతిస్తూ లంప్సమ్‌ కాంట్రాక్టు టెండర్లకు చంద్రబాబు సర్కార్‌ అనుమతి

ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీలు పూర్తి చేసేందుకు ఏడాదికి కేవలం రూ.వెయ్యి కోట్ల వ్యయానికి డబ్బుల్లేవ్‌

అమరావతిలో భవనాల నగిషీలు, సోకులకు రూ.వేల కోట్ల ఖర్చుపై విస్తుపోతున్న అధికారులు

ఆరు జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలు 33 ఏళ్ల లీజుకు కేటాయించేందుకు పచ్చజెండా

రాజధానిలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి

రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్‌డీఏకి స్థలాలు అప్పగింతకు ఆమోదం

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పయ్యావుల

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి ఇప్పటికే భారీ దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కారు అది చాలదన్నట్లుగా ఆ భవనాలకు నగిషీలు, అద్దాల అలంకరణలు, సోకుల పేరుతో మరో గోల్‌మాల్‌కు పచ్చజెండా ఊపింది! ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో అద్దాల అలంకరణతో పాటు స్తంభాలను అందంగా తీర్చిదిద్దడం లాంటి సోకుల కోసం ఏకంగా రూ.2,540 కోట్లతో లంప్సమ్‌ కాంట్రాక్టు ఇచ్చేందుకు కేబినెట్‌ పరిపాలన ఆమోదం ఇచ్చింది. అలాగే శాసనసభ భవనానికి నగిషీల కోసం మరో రూ.798 కోట్లతో లంప్సమ్‌ కాంట్రాక్టుకు పరిపాలన ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో చేపట్టిన మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బుల్లేవంటూ పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. రాజధానిలో భవనాల సోకులు, నగిషీల కోసం భారీ ఎత్తున వ్యయం చేయడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. కొత్త మెడికల్‌ కాలేజీలకు ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు వ్యయం చేస్తే నిర్మాణాలు పూర్తి అయ్యేవని, వాటిని చేపట్టకుండా రాజధాని భవనాలకు లగ్జరీ సోకుల కోసం అదనంగా ఏకంగా రూ.3,338 కోట్ల వ్యయానికి పరిపాలన ఆమోదం ఇస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉన్నతాధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కేబినెట్‌ నిర్ణయాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ మీడియాకు వెల్లడించారు.   

అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్లకు గ్లాస్‌ క్లాడింగ్, క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, కాలమ్‌ క్లాడింగ్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ పనుల కోసం రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం. మూడు ప్యాకేజీలుగా లంప్సమ్‌ కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిడెట్‌ ఎండీకి అనుమతి.  
⇒ శాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్‌ రింగ్, రూఫ్‌ అండ్‌ అప్రోచ్‌ బ్రిడ్జెస్‌ ఓవర్‌ పాలవాగు లాంటి సివిల్‌ స్ట్రక్చర్‌ పనులకు రూ.798 కోట్ల పరిపాలన అనుమతికి ఆమోదం. లంప్సమ్‌ కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీకి అనుమతి.  
⇒ రాజధానిలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములు రద్దు. ఆ భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్‌డీఏకి అప్పగించాలని నిర్ణయం. ఆర్‌ఎఫ్‌–5లో పేదల ఇళ్ల స్థలాల కోసం 09–05–2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులు సీఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు ఆమోదం.  

⇒ అమరావతిలో కృష్ణా కుడి గట్టు వరద నిరోధక నిర్మాణం కోసం రూ.443.26 కోట్లతో కరకట్ట బలోపేతం, విస్తరణకు ఆమోదం. రూ.149.82 కోట్లు, రూ.146.47 కోట్లు, రూ.146.97 కోట్లతో మూడు ప్యాకేజీలుగా పరిపాలన అనుమతి మంజూరు. గతంలో కాంక్రీట్‌ వాల్‌ నిర్మాణానికి రూ.1304.89 కోట్లతో ఇచ్చిన పరిపాలన అనుమతి రద్దు. 
⇒ అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో ట్విన్‌ ఆఫీస్‌ రెండు టవర్లు నిర్మాణానికి రూ.1,208 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం.  
⇒ అమరావతిలో జోన్‌––11 పరిధిలో ఉండవల్లిలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీము కింద మౌలిక సదుపాయాల పనులకు రూ.580 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. 
⇒ అమరావతిలో కొన్ని కూడళ్లలో మిగిలిన పనులకు గతంలో ఇచ్చిన రూ.1082 కోట్ల  పరిపాలన అనుమతి వ్యయాన్ని రూ.1180 కోట్లకు పెంచేందుకు ఆమోదం. 

⇒ రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌ స్కీములో సవరణలకు ఆమోదం. యాన్యుటీ పెంపు,  అప్పు మాఫీ కట్‌ ఆఫ్‌ తేదీ సరళీకరణకు సవరణలు. సీఆర్‌డీఏలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపునకు ఆమోదం. 
⇒ రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యత్యాస పనులకు ఆమోదం. అదనంగా రూ.354 కోట్ల వ్యయానికి ఆమోదం. 
⇒ ఢిల్లీలో 11.536 ఎకరాల భూమిలో కొత్తగా ఏపీ భవన్‌ నిర్మాణానికి ఆమోదం. రూ.124.50 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, నిర్మాణ పనులు నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌బీసీసీ)కు అప్పగించేందుకు అనుమతి.     
⇒ పోలవరం నిర్వాసిత కుటుంబాలకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద ఇళ్లు నిర్మాణానికి యూనిట్‌ ధర రూ.2.85 లక్షల నుండి రూ.3.57 లక్షలకు పెంచడానికి ఆమోదం.  

⇒ సహాయ పునరావాస  కాలనీ కాకుండా వేరే చోట ఇల్లు నిర్మించుకుంటే ఇళ్ల స్థలం విలువ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచడానికి ఆమోదం.  
⇒ పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలో 525 మీటర్లు పొడవున ఎస్కేప్‌ చానల్‌ తవ్వకం అదనపు పనులు నామినేషన్‌పై అప్పగించేందుకు ఆమోదం.   
⇒ శ్రీసత్యసాయి జిల్లా హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్‌–11 పరిధిలో పుంగనూరు  బ్రాంచ్‌ కెనాల్‌ 26 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల వరకు సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌తో ఆధునీకరించే పనికి సవరించిన అంచనా రూ.309 కోట్లకు పరిపాలన ఆమోదం.  
⇒ శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, అనకాపల్లి జిల్లాలోని పూడిమడక, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో మూడు ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణానికి తాజాగా రూ.1586.69 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం.   

Advertisement
 
Advertisement
Advertisement