Andhra Pradesh: చేరువలో చికిత్స

Basic health services are more accessible to people in Andhra Pradesh - Sakshi

గత 9 నెలల్లో డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో 43,10,363 మందికి సేవలు

నగరాలు, పట్టణాల్లో రోజుకు సగటున 18,970 మందికి చికిత్స

రాష్ట్ర వ్యాప్తంగా 542 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లలో వైద్యం

216 రకాల మందులు, 60 రకాల వైద్య పరీక్షలు 

7.51 లక్షల మందికి వైద్య పరీక్షలు.. నేరుగా వారి వాట్సాప్‌కు ఫలితాలు

గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 259 యూపీహెచ్‌సీలే 

దీంతో చిన్న జబ్బులకూ జిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి అవస్థలు 

ఈ ప్రభుత్వం రాగానే ఆ పరిస్థితులకు చెక్‌ పెడుతూ విప్లవాత్మక చర్యలు

25 వేల జనాభాకు ఒక అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ ఏర్పాటు

అందిస్తున్న వైద్య సేవలు ఇలా..
►ప్రతి వార్డుకు 2–3 కి.మీ దూరంలోపు లేదా 15 నిమిషాల నడక దూరంలో క్లినిక్‌ ఉంటుంది. 
►గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ప్రస్తుతం ఒక మెడికల్‌ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్, ఇతర సిబ్బందిని అందుబాటులోకి తెచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3,920 మంది ఉద్యోగులను ప్రభుత్వం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లకు మంజూరు చేసింది. నియా­మకాలు దాదాపు పూర్తయ్యాయి.     
►గతంలో ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం పది పడకలతో ఇన్‌పేషెంట్‌ విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది.  
►గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శాఖ అమలు చేసే ఆరోగ్య కార్యక్రమాలన్నీ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లతో పట్టణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 
►పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఆరు ఆరోగ్య కేంద్రాలను ఒక క్లస్టర్‌గా చేసి, అక్కడ ఈ సేవలు అందించేందుకు ఇప్పటికే వైద్య శాఖ  అల్ట్రాసౌండ్‌ మిషన్‌లను కొనుగోలు చేసింది.  

సాక్షి, అమరావతి: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో జనాభా 9 లక్షలు. టీడీపీ హయాంలో ఇక్కడ 13 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండేవి. అంటే సుమారు 70 వేల మందికి ఒకటన్న మాట. వీటిలోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండేది. దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న సమస్యలకు కూడా జీజీహెచ్‌కువెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రజలు ప్రైవేట్‌ క్లినిక్‌లను ఆశ్రయించేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. నగరంలో ఉన్న 13 ఆరోగ్య కేంద్రాలకు అదనంగా మరో 17 కలిపి మొత్తంగా 30 వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు మరింత చేరువయ్యాయి. అదే విధంగా విశాఖలో గతంలో 24 ఆరోగ్య కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 63 ఉన్నాయి.

విజయవాడలో గతంలో 29 ఉండగా, ప్రస్తుతం 41 అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు, విశాఖ, విజయవాడ నగరాల తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేరువ చేసింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం పట్టణ ప్రజలు జీజీహెచ్, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇందుకోసం నగర, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా మరిన్ని డాక్టర్‌ వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలను వైద్య శాఖ నెలకొల్పింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 73 మున్సిపాలిటీల్లో కేవలం 259 అర్బన్‌ ప్రిలిమినరీ హెల్త్‌ సెంటర్లు మాత్రమే ఉండేవి.

ఈ నేపథ్యంలో.. పట్టణాల్లో మధ్యతరగతి, పేద ప్రజలు సర్కార్‌ వైద్యం కోసం పడుతున్న అగచాట్లను సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ గుర్తించింది. వీటిని అధిగమించి వారికి వైద్యం మరింత చేరువ చేయాలని నిర్ణయించింది. 25 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేయడంలో భాగంగా గత టీడీపీ హయాంలో ఉన్న 259కి అదనంగా మరో 301 కేంద్రాలను కలిపి, మొత్తంగా 560 క్లినిక్‌ల ఏర్పాటుకు సంకల్పించింది. ప్రస్తుతం 542 చోట్ల వైద్య సేవలు అందుతున్నాయి.  

టెలీ మెడిసిన్‌తో అత్యాధునిక వైద్యం    
542 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు సగటున 18,970 మంది వైద్య సేవలు పొందుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 43,10,363 మంది వైద్య సేవలు పొందారు. క్లినిక్‌లలో టెలీమెడిసిన్‌ సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీంతో జనరల్‌ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిషన్‌ వంటి స్పెషలిస్ట్‌ వైద్యుల కన్సల్టేషన్‌ సైతం ప్రజలకు ఇక్కడే లభిస్తోంది. ఇలా 7.86 లక్షల మంది టెలీ మెడిసిన్‌ సేవలు పొందారు. 216 రకాల మందులు, 60 రకాల వైద్య పరీక్షలు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి.

వైద్య పరీక్షల కోసం సెమీ ఆటోమేటిక్‌ బయోకెమిస్ట్రీ అనలైజర్, 3–పార్ట్‌ హెమటాలజీ అనలైజర్‌ సహా పలు పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గత 9 నెలల్లో 7.51 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులను నేరుగా రోగుల వాట్సాప్‌కే పంపుతున్నారు. ఈహెచ్‌ఆర్‌ (ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డ్స్‌) విధానంలో రోగులకు అందించిన వైద్య సేవల వివరాలను వారి డిజిటల్‌ హెల్త్‌ ఖాతాల్లోకి అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు 15.09 లక్షల మంది హెల్త్‌ రికార్డులను వారి డిజిటల్‌ హెల్త్‌ ఖాతాలకు అనుసంధానించారు.

సొంత భవనాల నిర్మాణం
క్లినిక్‌ల కోసం సొంత భవనాలు సమకూర్చడంపైనా నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న 184 సొంత భవనాలకు మరమ్మతులు చేపట్టింది. మిగిలిన వాటి కోసం కొత్త భవనాల నిర్మాణం చేపడుతోంది. కొత్త భవనం నిర్మాణానికి రూ.80 లక్షలు, మరమ్మతులకు రూ.10 లక్షల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇలా రూ.374.61 కోట్లతో సొంత భవనాలను సమకూరుస్తున్నారు. నిర్మాణం పూర్తయిన 116 కొత్త భవనాలను ప్రారంభించి, వాటిల్లో సేవలు మొదలుపెట్టారు.  

ప్రజలు ఇబ్బంది పడకూడదనేదే లక్ష్యం
ప్రాథమిక వైద్యం కోసం పట్టణ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా వైఎ­స్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలను వారికి చేరువ చేస్తున్నాం. జాతీయ ప్రమాణాలతో వనరులు సమ­కూరుస్తున్నాం. నగర, పట్టణ ప్రజలు క్లినిక్‌లలో వైద్య సేవలు వినియోగించుకోవాలి. 
– జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌

త్వరలో ‘అల్ట్రా సౌండ్‌’ సేవలు 
రాష్ట్ర వ్యాప్తంగా 90 కేంద్రాలకు స్కానింగ్‌ పరికరాలు
సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో 542 ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో చిన్న మున్సిపాలిటీల్లో కనీసం ఒకటి, పెద్ద మున్సిపాలిటీల్లో, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆరు ఆరోగ్య కేంద్రాలకు ఒకటి చొప్పున 90 అ్రల్టాసౌండ్‌ స్కానింగ్‌ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఒక్కో పరికరం రూ.2.45 లక్షల చొప్పున 90 పరికరాలను రూ.2,20,50,000తో కొనుగోలు చేసింది. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ సేవలు అందించేందుకు వీలుగా ఆయా ఆస్పత్రులు, డయగ్నోసిస్‌ సెంటర్లను ప్రీ–కాన్సెప్షన్, ప్రీ–నేటల్‌ డయాగ్నోస్టిక్‌ టెక్నిక్స్‌ (పీసీపీఎన్‌డీటీ) చట్టం కింద రిజి్రస్టేషన్‌ చేయాల్సిందిగా డీఎంహెచ్‌ఓలందరికీ వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది  పూర్తవ్వగానే సేవలు ప్రారంభిస్తామని పట్టణ ఆరోగ్య కేంద్రాల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి రావడం ద్వా­రా నగరాలు, పట్టణాల్లోని గర్భిణులకు కడుపులో ఉమ్మ నీరు స్థా­యి, పుట్టబోయే బిడ్డకు వెన్నెముక, గుండె, ఇ­తర సమస్యలేమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. వీటితో పాటు సాధారణ ప్రజలకు అల్ట్రా­సౌండ్‌ స్కాన్‌ ద్వారా కడుపునొప్పి, గాల్‌బ్లాడర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీవాపు, అపెండిక్స్, ఇతర సమస్యలను నిర్ధారించవచ్చు. కాగా, విశాఖపట్నంలో 11, విజయవాడలో 8, గుంటూ­రులో 4, మిగతా నగరాలు, పట్టణాల్లో 3, 2, 1 చొప్పున ఈ పరికరాలను ఏర్పాటు చేశారు.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top