యాడికి: పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి ఆసుపత్రి కాలనీలో మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న నేత కార్మికులు శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు కుమారుడు జగదీష్, కుమార్తె పల్లవి ఉన్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం సీతమ్మ తాండా సమీపంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో పల్లవి 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 12 నుంచి పాఠశాలకు విద్యార్థులందరూ వెళ్తున్న నేపథ్యంలో నీవెప్పుడు వెళ్తావని పల్లవిని మంగళవారం తల్లి లక్ష్మి అడిగింది. ఆశ్రమ గిరిజన పాఠశాలలో చదవడం తనకు ఇష్టం లేదని పల్లవి చెప్పడంతో ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం శ్రీనివాసులు, లక్ష్మిలు తమ ఇంటి సమీపంలోని షెడ్డులో మగ్గం నేసేందుకు వెళ్లగా, పల్లవి ఇంటి వద్ద చెట్టుకు ఉరి వేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చెట్టుకు వేలాడుతున్న పల్లవిని కిందికి దింపి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


