కళ్యాణదుర్గం రూరల్: ఎన్నికల హామీలు అమలు చేయకుండా వంచించినందుకు నిరసనగా ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ నాయకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ హరినాథ్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడటమే కాకుండా.. తిరిగి వైఎస్సార్సీపీ నేతలే దాడికి యత్నించినట్టుగా సమన్వయకర్త తలారి రంగయ్యతో పాటు పలువురిపై కేసు నమోదు చేయించడం అరాచక పాలనకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. అనుమతి తీసుకుని ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టి.. అలజడి సృష్టించాలని ప్రయత్నించిన 15 మంది టీడీపీ నాయకులపై విచారణ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నేత దొడగట్ట నారాయణ, కన్వీనర్లు సుధీర్, గోళ్ళ సూరి, యువజన విభాగం నాయకుడు రామాంజినేయులు, మున్సిపల్ విభాగం నాయకులు దొడగట్ట మురళి, చరణ్, తదితరులు పాల్గొన్నారు.


