అనంతపురం అర్బన్: యోగాంధ్రలో భాగంగా ఈ నెల 16న దివ్యాంగుల కోసం జిల్లాస్థాయి థీమాటిక్ యోగా ప్రదర్శన పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై జాయింట్ కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా ప్రతి జిల్లాకూ ఒక థీమ్ ఇచ్చారన్నారు. ఈ క్రమంలో జిల్లాకు దివ్యాంగుల యోగా ఇచ్చారన్నారు. మంగళవారం అనంతపురంలోని పోలీసు పరేడ్ మైదానంలో దివ్యాంగుల కోసం థిమాటిక్ యోగా ప్రదర్శనకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని చెప్పారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు దివ్యాంగులకు సహకరించేలా చూడాలని ఎన్సీసీ కమాండెంట్, జిల్లా కో–ఆర్డినేటర్ను ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించి రవాణా, వసతి, భద్రత, వైద్యసదుపాయం, తదితర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. 18న తాడిపత్రి శ్రీబుగ్గ లింగేశ్వరస్వామి ఆలయంలో, 20న గుత్తికోట ప్రాంతంలో ప్రత్యేక పర్యాటక డెస్టినేషన్ యోగా ప్రదర్శన ఉంటుందన్నారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆయుష్ వైద్యాధికారులు లాల్యానాయక్, తిరుపతినాయుడు, ఆర్టీఏ సురేష్నాయుడు, ఆస్పత్రి పరిపాలనాధికారి మల్లికార్జునరెడ్డి, ఆర్ఐఓ వెంకటరమణ, డీఎస్డీఓ మంజుల, ఏపీఎంఎస్ఐ డీసీ రామ్మెహన్, ఐఅండ్పీఆర్ ఏపీఆర్ఓ ఫకృద్ధీన్, తదితరులు పాల్గొన్నారు.


