అనంతపురం: స్టార్టప్లకు దన్నుగా రతన్ టాటా ఇన్నోవేషన్ నిలుస్తోందని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. రతన్టాటా ఇన్నోవేషన్ హబ్, అనంతపురం స్పోక్ ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల కేంద్రం సమన్వయంతో ‘గ్రీన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‘ థీమ్తో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఇది వరకు ఏదైనా కొత్త ప్రొడక్ట్ను మార్కెట్లోకి తీసుకురావాలన్నా, సహకారం కావాలన్నా బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలపై ఆధారపడాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ కారణంగా ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. జిల్లాలో జేఎన్టీయూ, ఎస్కేయూ వంటి పెద్ద విద్యాసంస్థలు, ఎన్నో కళాశాలలతో పాటు ప్రైమరీ సెక్టార్గా ఉన్న అగ్రికల్చర్, హార్టికల్చర్లో ఎంతోమంది ఇన్నోవేటర్స్ ఉన్నారని, వీరందరినీ ముందుకు తీసుకెళ్లడానికి రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ చాలా అవసరమన్నారు. గత 4 నెలలతో పోలిస్తే కొన్ని స్టార్టప్లు ఐడియా స్టేజ్ నుంచి ప్రాడక్ట్ స్టేజ్కి వెళ్లడం చాలా సంతోషకరమన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శైలజ, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాపరెడ్డి, కాలుష్య నివారణ బోర్డు ఈఈ శశికళ, కేవీఐబీ ఇన్చార్జ్ వరప్రసాద్, ఎల్డీఎం మారుతీశ్రీనివాస్, ఇతర అధికారులు, వివిధ స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు, యువత, మహిళా సంఘాల సభ్యులు, స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొన్నారు.


