ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించండి

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

కలెక్టర్‌ ఆనంద్‌

కణేకల్లు: ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ పేర్కొన్నారు. శుక్రవారం కణేకల్లు పట్టణంలోని నేసేపేట ప్రాథమిక పాఠశాలలో ‘బడి పిలుస్తోంది’ స్పెషల్‌ డ్రైవ్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. తన పిల్లలు గీతిక, నంద్వితను తండ్రి బాలరాజు ప్రభుత్వ బడిలో చేర్పించడం పట్ల కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతేడాది కంటే ఈ సారి అదనంగా 20 వేల మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. కణేకల్లులో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న ఎస్సీ హాస్టల్‌ భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. సొల్లాపురం గ్రామంలో ‘అనంత పాలదాణా’ కింద రైతులకు దాణా పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ డీఈఓ లక్ష్మణ్ణ, వెటర్నరీ జేడీ ప్రేమ్‌చంద్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈఈ రమణారెడ్డి, తహసీల్దార్‌ బ్రహ్మయ్య, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ షేక్షావలీ, ఎంఈఓ–2 భవానీ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

హంద్రీ–నీవా కాలువ

లైనింగ్‌ పనుల పరిశీలన

ఉరవకొండ: మండలంలోని చిన్నమూస్టురు, కౌకుంట్ల, వై.రాంపురం గ్రామాల వద్ద హంద్రీ–నీవా కాలువ వెడల్పు, లైనింగ్‌ పనులను కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ శుక్రవారం పరిశీలించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌నాయక్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement