ఆత్మకూరు: మండలంలోని పంపనూరు వెలసిన సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని ఎస్పీ జగదీష్ మంగళవారం సందర్శించారు. ఈ ఆయనకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, సిబ్బంది నాగేశ్వరరెడ్డి, ఆనంద్, అర్చకులు రాము, సాయి తదితరులు ఉన్నారు.
పండ్ల తోటను ధ్వంసం చేసిన రెవెన్యూ అధికారులు
తాడిపత్రి టౌన్: మండలంలోని బుగ్గ గ్రామం వద్ద రైతు నాగరాజుకు చెందిన పండ్ల తోటను మంగళవారం సాయంత్రం 5 గంటలకు రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. మూడు ఎకరాల్లో మామిడి, అల్ల నేరేడు, సీతాఫలం, జామ చెట్లను రైతు పెంచుతున్నాడు. అయితే ప్రభుత్వ భూమిని అక్రమించాడనే నెపంతో 15 మంది వీఆర్ఓలు, వీఆర్ఏలతో కలసి ఆర్ఐ ఈశ్వర్రెడ్డి ఓ టెంపో వాహనంలో అక్కడకు చేరుకుని పండ్ల చెట్లను పెకలించేశారు. ఆ సమయంలో నాగరాజు కుటుంబసభ్యులు ప్రాదేయపడిన అధికారులు వినలేదు. దాదాపు రాత్రి 8 గంటల వరకూ ఈ ప్రక్రియ కొనసాగింది. గ్రామంలో చాలా మంది రైతులు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు కేవలం నాగరాజు పైనే కక్షపూరితంగా వ్యవహరించారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రాఘవేంద్రప్రసాద్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ఆర్ఐ ఈశ్వర్రెడ్డి ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులో రాలేదు.


