పుట్లూరు: మండలంలోని కోమటికుంట్ల గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య కొడవళ్లు, కర్రలతో దాడులు చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు... స్థలం విషయంలో మూడు రోజుల క్రితం గ్రామంలోని రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ వర్గం ఫిర్యాదు మేరకు అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సోమవారం రాత్రి ఓ మహిళ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో దాదాపు 15 మంది కొడవళ్లు, కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడుల్లో ఎనిమిది మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
నేడు యల్లనూరు, పెండేకల్లు చేపల చెరువుల వేలం
అనంతపురం అగ్రికల్చర్: యల్లనూరు, పెండేకల్లు గ్రామాల్లోని చేపల చెరువులను వేలం వేయనున్నారు. ఈ మేరకు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎఫ్డీఓ) ఎంఎస్ ఆసీఫ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. యల్లనూరు చెరువుకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆ గ్రామ సచివాలయంలో వేలం నిర్వహించనున్నారు. అలాగే పెండేకల్లు చెరువుకు సంబంధించి పెద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న మత్స్యకారులు రూ.వెయ్యి ధరావత్తు చెల్లించి వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చు.
జాతీయ పోటీలకు ఎంపిక
బుక్కరాయసముద్రం: ఈ నెల 6 నుంచి భువనేశ్వర్లో జరిగే జాతీయ స్థాయి రగ్బీ టోర్నీకు సిద్దరాంపురం జెడ్పీ హెచ్ఎస్ విద్యార్థిని సుస్మిత ఎంపికైంది. దీంతో మంగళవారం ఆమెను హెచ్ఎం నీరజ, పీడీ నాగరాజు అభినందించారు.


