అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన, పాత పీఆర్సీ బకాయిల సాధనకు పోరాటాలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ నివేదికను ప్రవేశపెడుతూ మండల కౌన్సిళ్లు త్వరగతిన పూర్తి చేసి మండల నివేదికలు జిల్లా శాఖకు పంపించాలని కోరారు. అనంతరం రాష్ట్ర భవన నిర్మాణానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.


