అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి పంచాయతీ గొల్లపల్లిలో ఇటీవల వేసిన బీటీ రోడ్డు నెల రోజులు తిరగకుండానే కంకర తేలింది. అనంతపురం–కళ్యాణదుర్గం ప్రధానరోడ్డు నుంచి గొల్లపల్లి మీదుగా కామారుపల్లి వరకూ సుమారు రూ. 90 లక్షలతో ఈ రోడ్డు నిర్మించారు. గతంలో 2006 అంటే 20 ఏళ్ల క్రితం ఇదే దారికి తారురోడ్డు నిర్మించారు. అక్కడక్కడ చిన్నచిన్న గుంతలు పడ్డాయి తప్ప పెద్దగా దెబ్బ తినింది లేదని గ్రామస్తులు చెబుతున్నారు. 25 రోజుల క్రితం వేసిన తారు రోడ్డు అప్పుడే గుంతలు పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లనే తారు రోడ్డు దెబ్బతినిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– రాప్తాడు రూరల్:


