అనంతపురం: డ్రగ్స్ ముప్పు నుంచి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. యువతలో పెరిగిన మత్తు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనార్కోటిక్ డ్రగ్స్ – సైకోట్రోపిక్శ్రీ పదార్థాలపై మెడికల్ షాప్ యజమానులు, ఫార్మాసిస్టులకు జేఎన్టీయూ (ఏ)లో సోమవారం ఎస్పీ జగదీష్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు శ్రీఆపరేషన్ గరుడశ్రీను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై కఠిన నిఘా, ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం, ముఖ్యంగా షెడ్యూల్ –హెచ్, హెచ్1 తదితర ఔషధాల దుర్వినియోగం పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టపరమైన నిబంధనలను మెడికల్ షాపు నిర్వాహకులు కచ్చితంగా పాటిస్తూ, సమాజాన్ని డ్రగ్స్ ముప్పు నుంచి కాపాడడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం, అనుమానాస్పద కార్యకలాపాలు, సహాయం కోసం ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు కాల్ చేయాలన్నారు. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఓ. విశ్వనాథరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వీరకుమార్ రెడ్డి, అనంతపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగారెడ్డి, తదితరులు పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగాన్ని అరికడదామంటూ సదస్సుకు హాజరైన ప్రముఖులు, విద్యార్థులతో ఎస్పీ జగదీష్ ప్రతిజ్ఞ చేయించారు.
రాష్ట్ర ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ


