గుత్తి రూరల్: మండలంలోని బాచుపల్లి గ్రామ శివారున దారి దోపిడీకి విఫలయత్నం జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు... గుత్తి మండలం కరిడికొండ గ్రామానికి చెందిన నాగరాజు ఆదివారం రాత్రి వ్యక్తిగత పనిపై బాచుపల్లి శివారున ఉన్న బాట సుంకులమ్మ ఆలయం వద్దకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకున్న అనంతరం గ్రామానికి నడుచుకుంటూ వెళుతుండగా 44వ జాతీయ రహదారిపై ప్లైఓవర్ బ్రిడ్జి పక్కన నిర్మానుష్య ప్రాంతంలోకి చేరుకోగానే ఇద్దరు యువకులు దాడి చేశారు. ఇనుప రాడ్లతో దాడి చేయడంతో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. సెల్ఫోన్, కొంత నగదు లాక్కొన్నారు. ఆ సమయంలో తేరుకున్న నాగరాజు బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు పరుగున అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన దుండగులు పారిపోతుండగా వెంబడించి బాట సుంకులమ్మ ఆలయం ఎదురుగా క్రషర్కు వెళ్లే మార్గంలో పట్టుకున్నారు. అనంతరం సుంకులమ్మ ఆలయం వద్ద విద్యుత్ స్తంభానికి చీరలతో కట్టేశారు. గాయపడిన నాగరాజును చికిత్స నిమిత్తం గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


