అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ప్రశాంతంగా ముగియడంతో ఇంటర్ బోర్డు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చివరి రోజు ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్ష జరిగింది. జనరల్ విద్యార్థులు 16,409 మందికి గాను 16,162 మంది హాజరయ్యారు. 247 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనరు, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ నాలుగు కేంద్రాలను పరిశీలించారు. అలాగే డీవీఈఓ ఎస్వీఎస్ గురువయ్యశెట్టి మూడు, కమిటీ సభ్యులు 9, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 6, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 10 కేంద్రాలను తనిఖీలు చేశారు.
రేకుల షెడ్డులో పరీక్షలు.. : అనంతపురం నగర శివారు గుత్తిరోడ్డులోని నలంద జూనియర్ కళాశాల కేంద్రంలో రేకుల షెడ్డులో విద్యార్థులకు పరీక్షలు రాయించడంతో వేడిసెగకు అల్లాడిపోయారు. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం పబ్లిక్ పరీక్షలను ఎట్టి పరిస్థితిలోనూ రేకుల షెడ్లలో నిర్వహించరాదు. పక్కా భవనాల్లోనే నిర్వహించాలి.
ఆనందంతో ఊళ్లకు.. : నగరంలో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, ప్రైవేట్ హాస్టళ్లు, అద్దె గదులు, బంధువుల ఇళ్లల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు చివరి రోజు పరీక్ష ముగియగానే లగేజీ సర్దుకుని ఆనందంగా సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆర్టీసీ బస్టాండు కిటకిటలాడింది.


