గుత్తి రూరల్: ఈత సరదా ఓ జవాన్ ప్రాణాలను బలిగొంది. గుత్తి మండలం రజాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మండలంలోని శ్రీపురం గ్రామానికి చెందిన వేపనింటి వెంకటేష్, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు ఆంజనేయులు(24) అగ్నివీర్లో భాగంగా ఆర్మీలో ఉద్యోగం సాధించి గత మూడేళ్లుగా ఉత్తర్ప్రదేశ్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఉగాది పండుగకు సెలవుపై సోమవారం మధ్యాహ్నం వచ్చిన ఆయన.. మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితులు హరీష్, సోమాంజనేయులుతో కలిసి రజాపురం శివారున జాతీయ రహదారి నిర్మాణం కోసం తవ్విన గుంతల్లో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ఈత అంతంత మాత్రమే వచ్చిన ఆంజనేయులు గుంత మధ్య వరకూ వెళ్లి తిరిగి గట్టుకు చేరుకోలేక నీట మునిగి గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న ఇద్దరు స్నేహితులు ఆంజనేయులును కాపాడేందుకు చేసిన ప్రయత్రాలు ఫలించలేదు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లను ఎస్ఐ సురేష్ రప్పించి ఆంజనేయులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో గుంతకల్లు నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. వారు పెద్ద వల వేయడంతో ఆంజనేయులు మృతదేహం అందులో చిక్కుకుని బయటపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


