బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లులో దుండగుల అరాచకానికి ఓ రైతు కష్టం బూడిదైంది. ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహూతైంది. స్థానికులు తెలిపిన మేరకు... ఉంతకల్లులోని ఆర్డీటీ కాలనీకి చెందిన రైతు హెచ్.పరశురామ్ తనకున్న 6 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల దిగుబడులు సాధించాడు. కోతల అనంతరం కంకులను పొలంలోనే రాసిగా నిల్వ చేశాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మొక్కజొన్న కంకులన్నీ కాలి బూడిదయ్యాయి. మార్కెట్లో క్వింటా ధర రూ.2 వేలు ఉండటంతో దాదాపు రూ.3.60 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ఘటనపై బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.


