అనంతపురం అర్బన్: వేసవి వడగాల్పులు తీవ్రస్థాయిలో ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో వేసవి వడగాల్పుల కార్యాచరణ ప్రణాళిక–2026పై అధికారులతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీలు, మునిసిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వాటి ద్వారా తాగునీరు, మజ్జిగ సరఫరా చేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
కార్మికుల పనివేళల్లో మార్పు
ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలు, పారిశుధ్య కార్మికుల పనివేళల్లో మార్పుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉదయం 10 లోపు, సాయంత్రం 3 గంటల తరువాత పని చేయించాలన్నారు. పశువుల కోసం తొట్టెలు ఏర్పాటు చేసి నీటిని నింపాలన్నారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
జాగ్రత్తలు తప్పనిసరి
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. వీలైనంతవరకు చల్లని ప్రదేశాల్లో ఉండాలన్నారు. బయటకు వెళ్లే సమయంలో గొడుగు లేదా టోపీ ధరించాలని చెప్పారు. తెల్లని నూలు దుస్తులు ధరించాలన్నారు. నేరుగా ఎండలో తిరగడం, మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య శారీక శ్రమతో కూడిన పనులు చేయవద్దని సూచించారు. తగిన నీరు, మజ్జిగ, గ్లూకోజ్నీరు తీసుకుంటూ ఉండాలన్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశానికి చేర్చి వైద్యసహాయం అందించాలన్నారు.


