అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 143 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు కలిపి 32,289 మందికి గాను 31,929 మంది హాజరయ్యారు. 360 మంది గైర్హాజరయ్యారు. అనంతపురంలోని రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల కేంద్రాన్ని కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా పరిశీలకులు సుబ్బారావు తొమ్మిది కేంద్రాలు, డీఈఓ ప్రసాద్బాబు ఆరు కేంద్రాలు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ రెండు కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 54 కేంద్రాలను తనిఖీలు చేశారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలకు 130 మంది గైర్హాజరు
ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన తెలుగు, ఉర్దూ పరీక్షలకు 130 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 720 మంది విద్యార్థులకు గాను 590 మంది హాజరయ్యారు.


