● జాతీయ సమ్మేళనంలో మేయర్ వసీం
అనంతపురం క్రైం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం అన్నారు. ‘అభివృద్ధి చెందిన ఢిల్లీ – 2047’ అంశంపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సమ్మేళనంలో మేయర్ వసీం పాల్గొని ‘పట్టణాల అభివృద్ధి – దీర్ఘకాలిక ఫలితాలు’ అంశంపై మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను నేరుగా అందించేందుకు ఏర్పాటైన సచివాలయ వ్యవస్థపై ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాల సేవలను వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచారన్నారు. అలాగే డిజిటల్ బోధన విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి విద్యా ప్రమాణాలను పెంచే దిశగా చర్యలు చేపట్టిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సమ్మేళనంలో భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మేయర్లతో పాటు దక్షిణాఫ్రికా, రష్యా, నెదర్లాండ్స్, ఇథియోపియా, టర్కీ, బ్రెజిల్ దేశాలకు చెందిన మేయర్లు, ప్రతినిధులు హాజరయ్యారు.


