అనంతపురం అర్బన్: ‘అరటి ధర పతనమైన తరుణంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అరటి టన్ను రూ.15 వేలతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి’ అని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా తలపెట్టామని చెప్పారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో పండ్ల తోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి శివారెడ్డి, రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బీహెచ్ రాయుడు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. జిల్లాలో 18,600 హెక్టార్లలో అరటి సాగైందన్నారు. ఎకరాకు రూ.లక్ష వరకు రైతు పెట్టుబడి పెట్టారన్నారు. 20 రోజుల క్రితం అరటి టన్ను రూ.23 వేలు ఉండేదన్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్దేశాలకు అరటి ఎగుమతి నిలిచిపోయిందన్నారు. దీంతో అరటి టన్ను రూ.8 వేలకు మించి పలకడం లేదని పేర్కొన్నారు. ధర పతనమవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళ చెందుతున్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వమే టన్ను అరటి రూ.15 వేలతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అరటి తోటలను పరిశీలించి జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలన్నారు.


