
ప్రభుత్వ బడిని కాపాడుకుందాం : యూటీఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజలను సమన్వయం చేసుకుని ప్రభుత్వ బడులను కాపాడుకుందామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైతిక విలువలు నేర్పుతున్న ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య మాట్లాడుతూ.. పాఠశాల ప్రారంభ దినాల నుంచి విద్యలో వెనుకబడిన విద్యార్థులకు చదువుపై ఆసక్తిని కల్పించేలా కృషి చేయాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు అబ్దుల్ వహాబ్ ఖాన్, శేఖర్, రాముడు, సుబ్బరాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ, ఆడిట్ కమిటీ కన్వీనర్ చంద్రమోహన్ పాల్గొన్నారు.