ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి

Jun 30 2025 4:27 AM | Updated on Jun 30 2025 4:27 AM

ఆర్టీ

ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి

ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర

అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి డిమాండ్‌

అనంతపురం టవర్‌క్లాక్‌: ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని ఏపీపీటీడీ ఈయూ (ఎంప్లాయీస్‌ యూనియన్‌) రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన టేబుల్‌పై ఉన్న ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలని, ఉద్యోగ విరమణ పొందిన వారికి గ్రాట్యూటీ, టర్మినల్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బకాయిలు వెంటనే చెల్లించాలన,ఇ డబల్‌ డ్యూటీలకు సంబంధించి ఉద్యోగులకు ఇస్తున్న రెమ్యూనరేషన్‌ను మరింత పెంచాలని కోరారు. టిమ్స్‌ డ్యామెజీలపై చేస్తున్న రికవరీలను నిలుపుదల చేయాలన్నారు. కాలం చెల్లిన బస్సుల బ్రేక్‌ డౌన్‌ విషయంలో గ్యారేజీ సిబ్బందిని బాధ్యులను చేస్తూ పనిష్‌మెంట్‌ ఇస్తున్నారని, ఈ విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. కార్యక్రమంలో ఈయూ నాయకులు ఖాన్‌, రామకృష్ణ, కొండయ్య, మల్లికార్జున, విశ్వనాథరెడ్డి, గోపాల్‌, ఓబులరత్నం తదితరులు పాల్గొన్నారు.

బదిలీల తీరుపై

ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్ల అసంతృప్తి

అనంతపురం సెంట్రల్‌: ఉమ్మడి జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ ఆదివారం ఉద్యాన, పశు సంవర్థకశాఖ కార్యాలయాల్లో కొనసాగింది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్‌ కింద ధరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్‌ చేపట్టారు. అయితే కొందరు తాము కోరుకున్న స్థానం కాకుండా మరో స్థానం కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యానశాఖ పరిధిలో చేపట్టిన బదిలీల ప్రక్రియకు 280 మంది విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌లు హాజరు కాగా, వారి ఎస్‌ఆర్‌లు ఇతర ధ్రువీకరణ పత్రాలను ఉద్యానశాఖ ఉమ్మడి జిల్లాల డీడీలు ఉమాదేవి, చంద్రశేఖర్‌, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, ఏడీహెచ్‌ దేవాందన్‌, సూపరింటెండెంట్‌ బాషా తదితరులు పరిశీలించి, పోస్టింగ్‌ కల్పించారు. అలాగే పశు సంవర్థకశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల జేడీలు వెంకటస్వామి, శుభదాస్‌, డీడీలు, సూపరింటెండెంట్‌ల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్‌కు 180 మంది విలేజ్‌ అనిమిల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌లు హాజరయ్యారు.

ట్యాంకర్‌ దగ్ధం

గుత్తి రూరల్‌: మండలంలోని బసినేపల్లి శివారున కర్నూలు జిల్లా జి.ఎర్రగుడి గ్రామం వద్ద ఆదివారం టైరు పేలి మంటలు చెలరేగడంతో ఓ ట్యాంకర్‌ దగ్ధమైంది. గుత్తి నుంచి ఆదోని వైపు బెల్లం పాకంతో వెళ్తున్న ట్యాంకర్‌ గుత్తి–పెండేకల్లు రైలు మార్గంలోని రైల్వే బ్రిడ్జి కిందకు చేరుకోగానే టైరు పేలింది. దీంతో మంటలు చెలరేగి ట్యాంకర్‌కు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్‌, క్లీనర్‌ బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే లోపు ట్యాంకర్‌ పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని రైల్వే అధికారులతో పాటు జొన్నగిరి పోలీసులు పరిశీలించారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్త

ఇంటిపై రాళ్ల దాడి

నార్పల: మండలంలోని వెంకటాంపల్లిలో నివాసముంటున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త మహబూబ్‌పీరా ఇంటిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఏడుగురు ఆదివారం రాళ్లతో విరుచుకుపడ్డారు. బాధితుడు తెలిపిన మేరకు... తన ఇంటి పక్కనే ఉన్న కొద్దిపాటి స్థలాన్ని గతంలో మసీదుకు మహబూబ్‌ పీరా విరాళం కింద ఇచ్చాడు. ఆ స్థలంలో గ్రామంలోని ముస్లిములంతా కలసి మసీదుతో పాటు ప్రహరీనీ నిర్మించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు జోక్యం చేసుకుని మసీదుకు ప్రహరీ నిర్మాణాన్ని ఆక్షేపిస్తూ మహబూబ్‌పీరాను నిలదీశారు. సర్దిచెప్పే ప్రయత్నం చేసిన మహబూబ్‌పీరాపై దాడికి ప్రయత్నించడంతో ఆయన ఇంట్లోకి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నాడు. దీంతో ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఘటనలో మహబూబ్‌పీరా కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలు నడిమిదొడ్డి రహీం, అప్పడు, హుసేన్‌పీరా, కాదర్‌వలి, హాజీ వలి, వలి, హాజీవలిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

వ్యక్తి దుర్మరణం

డి.హీరేహాళ్‌(రాయదుర్గం): వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. డి.హీరేహాళ్‌ గ్రామానికి చెందిన షబ్బీర్‌ (45) కుమార్తె బళ్లారిలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం బళ్లారికి వెళ్లి కుమార్తెను పలకరించి, ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన షబ్బీర్‌.. గ్రామ సమీపంలోకి చేరుకోగానే హెల్మెట్‌ జారి కిందపడడంతో బ్రేక్‌ వేశాడు. అదే సమయంలో వెనుకనే వేగంగా దూసుకొచ్చిన టెంపో ట్రావెలర్‌ వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి కేసు నమోదు చేశారు.

ఆర్టీసీ సమస్యలు  పరిష్కరించాలి 1
1/2

ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి

ఆర్టీసీ సమస్యలు  పరిష్కరించాలి 2
2/2

ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement