
సజావుగా వీఆర్ఓల బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆదివారం చేపట్టిన చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల గ్రేడ్–2 వీఆర్ఓల బదిలీల కౌన్సిలింగ్ సజావుగా జరిగింది. మొత్తం 328 మంది హాజరు కాగా, ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు 121 మంది ఉన్నారు. మరో 53 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ బదిలీ కౌన్సెలింగ్ను డీఆర్ఓ ఎ.మలోల, అనంతపురం. శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టరేట్ పరిపాలనాధికారులు అలెగ్జాండర్, వెంకటనారాయణ నిర్వహించారు. ఎస్ఆర్లు, ఇతర పత్రాలను డిప్యూటీ తహసీల్దార్లు మూర్తి, లీలాకాంత్ పరిశీలించారు. ఇదిలా ఉండగా ఉదయం 11గంటలకు మొదలు కావాల్సిన బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలు కావడంతో చంటిపిల్లలతో వచ్చిన మహిళా వీఆర్ఓలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
వెంటనే పీఆర్సీ ప్రకటించాలి : ఎస్టీయూ
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి ఎస్.రామాంజనేయులు పేర్కొన్నారు. పీఆర్సీతో పాటు డీఏ కూడా ప్రకటించాలన్నారు. బదిలీ అయిన టీచర్లకు పొజిషన్ ఐడీలు కేటాయించి జీతాలకు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. సోమవారం ఉద్యోగ విరమణ పొందుతున్న టీచర్ల స్థానాల్లో సర్దుబాటు కింద ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ జి.కిషోర్, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, రామకృష్ణ, నరసింహ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సజావుగా వీఆర్ఓల బదిలీల కౌన్సెలింగ్