
సీటు.. ‘తమ్ముళ్ల’తో తలపోటు!
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బి.ఉజ్జినప్ప. బుక్కరాయసముద్రం మండలం దండువారిపల్లి గ్రామం. ఈయన భార్య మృతి చెందింది. కూతురు బి.హారిక 7వ తరగతి పూర్తయింది. ఈసారి 8వ తరగతికి వెళ్తోంది. బుక్కరాయ సముద్రం కేజీబీవీలో 3, కురుగుంట కేజీబీవీలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముందుగా తల్లిదండ్రులు లేని పిల్లలకు, ఆ తర్వాత తల్లి లేదా తండ్రి లేని పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ క్రమంలో ఆ రెండు కేజీబీవీల్లోనూ ఖాళీ సీట్లయితే భర్తీ చేశారు కానీ తల్లిలేని హారికకు కాకుండా తల్లిదండ్రులిద్దరూ ఉన్న పిల్లలకు అవకాశం కల్పించారు. ఈ వ్యవహారం వెనుక కొందరు మంత్రాంగం నడిపారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. హారిక తండ్రి రోజూ సమగ్రశిక్ష కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు.
అనంతపురం ఎడ్యుకేషన్: కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం రాజకీయ పైరవీలు, అధికార పార్టీకి చెందిన చోటా నాయకుల ఒత్తిళ్లు వెరసి అర్హులైన ఆడ పిల్లలకు అవకాశం దక్కకుండా పోతోంది. జిల్లాలో మొత్తం 32 కేజీబీవీలున్నాయి. ప్రతి కేజీబీవీలోనూ ఈ విద్యా సంవత్సరం (2025–26)లో 6వ తరగతిలో చేరేందుకు 40 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు 40 సీట్ల చొప్పున భర్తీకి చర్యలు తీసుకున్నారు. అంతా ఆన్లైన్ విధానంలో రాష్ట్ర స్థాయి అధికారులే ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అయితే మిగులుగా ఉన్న సీట్ల భర్తీ జిల్లా అధికారులకే ఇవ్వడం తలనొప్పిగా మారింది.
మా వారికి సీటు ఇవ్వాల్సిందే..
ఖాళీ సీట్ల భర్తీకి జాబితా చాంతాడంత తయారైంది. దీంతో ఎవరికివారు పైరవీలు చేస్తూ జిల్లా అధికారులతో పాటు స్పెషల్ ఆఫీసర్లపై ఒత్తిళ్లు చేస్తున్నారు. కొందరు చోటా నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు తీసుకొచ్చి అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ఓ మంత్రి తన నియోజకవర్గంలోని కేజీబీవీ ఎస్ఓపై చోటా నాయకులు తీవ్ర ఒత్తిడి చేసి ‘మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను తీసేయిస్తాం’ అంటూ హెచ్చరించడంతో ఆమె అంతేస్థాయిలో తిరగబడ్డారు. అయితే ఏమి జరిగిందే ఏమో తెలీదుకాని ఇటీవల ఖాళీ సీట్ల భర్తీకి వచ్చేసరికి వారు ఏది చెబితే అందుకు ఆమె అంగీకరిస్తూ జిల్లా అధికారులకు సిఫార్సు చేయడం విశేషం.
కేజీబీవీ ప్రవేశాలకు
ఎస్ఓలు, అధికారులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు
అర్హులైన ఆడబిడ్డలకు అన్యాయం
నిబంధనల మేరకే భర్తీ
కేజీబీవీల్లో వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ విషయంలో నిబంధనల మేరకే ముందు కెళ్తున్నాం. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితోనే భర్తీ చేస్తున్నాం. తల్లిదండ్రులు లేని, తల్లి లేక తండ్రి ఉన్న బాలికలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ తర్వాత డ్రాపౌట్స్, పేద పిల్లలను పరిగణనలోకి తీసుకుంటున్నాం.
– టి.శైలజ, సమగ్రశిక్ష ఏపీసీ

సీటు.. ‘తమ్ముళ్ల’తో తలపోటు!

సీటు.. ‘తమ్ముళ్ల’తో తలపోటు!