
మద్యం మత్తునే హత్యకు కారణం!
గతంలో వారి మధ్య ఎలాంటి పరిచయం లేదు. అయినా మద్యం వారి మధ్య మాటలు కలిపింది. అదే రోజే మద్యం మత్తు విచక్షణను కోల్పోయేలా చేసి ఒకరి హత్యకు కారణమైంది. నగరంలోని బళ్లారి బైపాస్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ సమీపంలో ఈ నెల 23న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
అనంతపురం: చిన్నపాటి వాదన కారణంగా ఘర్షణ పడి ఓ యువకుడిని హతమార్చిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం నాల్గో పట్టణ పీఎస్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
ఈ నెల 24న ఉదయం అనంతపురంలోని బళ్లారి బైపాస్ సర్కిల్లో జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఓ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పార్క్లో పడుకుని ఉన్న వ్యక్తి తలపై గుర్తు తెలియని వ్యక్తులు ఫుట్పాత్ బ్రిక్తో కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. హతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి గార్లదిన్నె మండలం, కోటంక గ్రామానికి చెందిన గూడూరు సిదానందగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో బంధువులు వచ్చి నిర్ధారించారు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ ఎన్.జగదీష్ కేసు నమోదు చేసి, పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
నేర పరిశోధనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని..
తొలుత సిదానందను ఆయన భార్య తరఫు వారు హత్య చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం కాగా, ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టి అనుమానాల్లో వాస్తవం లేదని నిర్ధారించారు. నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో నేర పరిశోధనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మద్యం షాపులో ఉన్న సీసీ పుటేజీల ఆధారంగా ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. హత్య జరిగిన అనంతరం ఇద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకుని రైలు మార్గంలో తిరుపతికి చేరుకున్నట్లుగా పసిగట్టారు. అనంతరం పక్కా ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో సిదానందను హత్య చేసినట్లుగా అంగీకరించారు.
భార్యను దూషించాడనే...
అనంతపురంలోని ఐదో రోడ్డు భవానీ గుడి వద్ద నివాసముంటున్న ఎరికల నాగయ్య కుమారుడు ఎరికల లక్ష్మన్న అలియాస్ అలీ/ చిన్న లింగన్న/ అంజి, కళ్యాణదుర్గం రోడ్డులోని విద్యారణ్య నగర్లో నాగులుకట్ట వద్ద నివాసముంటున్న తుమ్మశెట్టి వెంకటరెడ్డి ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ బొప్పాయి, దోసకాయ లోడింగ్ పనులు చేస్తూ, తాగుడుకు అలవాటు పడ్డారు. ఈ నెల 23న రాత్రి బళ్లారి బైపాస్ సర్కిల్ సమీపంలో మద్యం షాపు వద్ద తాగుతూ అప్పటికే అక్కడున్న సిదానందతో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఎరికల లక్ష్మన్నను సిదానంద బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. లక్ష్మన్న భార్యనుద్ధేశించి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆవేశానికి లోనైన లక్ష్మన్న తన స్నేహితుడు వెంకటరెడ్డితో కలసి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న పార్కులో సేద తీరుతున్న సిదానంద వద్దకు చేరుకుని నుదుటిపై ఫుట్బాత్ బ్రిక్తో దాడి చేశారు. సిదానంద అక్కడికక్కడే చనిపోవడంతో ఇద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకుని రైలులో తిరుపతికి వెళ్లారు. నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ ఎన్.జగదీష్, ఎస్ఐలు కె.ప్రసాద్, పి.విజయభాస్కర్ నాయుడు, టెక్నికల్ టీంను ఎస్పీ పి.జగదీష్ అభినందించారు.
సిదానంద హత్య కేసులో వీడిన మిస్టరీ
చిన్నపాటి గొడవ కారణంగా హత్య
నిందితుల అరెస్ట్