
సిఫారసుకే పెద్దపీట
అనంతపురం సిటీ: ‘మనకు కావాల్సిన పిల్లలు వస్తున్నారు. జర చూసుకోండి. లెటర్ కూడా ఇచ్చి పంపుతున్నాం. వారు కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇవ్వండి. లేదంటే రోడ్డు పాయింట్కు వేయండి. ఏ ఒక్కటీ మిస్ కావడానికి వీల్లేదు. అడిగినవన్నీ చేయాల్సిందే’ అంటూ సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్ల మీద ఫోన్లు చేశారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు ఆదివారం అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. ఓ వైపు కౌన్సెలింగ్ ప్రక్రియలో బిజీబిజీగా ఉన్నా.. మరోవైపు ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఫోన్ కాల్ను అధికారులు లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హల్చల్ చేశారు. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారు ముందుగా రావాలని, లెటర్లు లేని వారిని పక్కన ఉండాల్సిందిగా సూచించారు. లెటర్లు స్వీకరించి వారు ఎక్కడికి పోస్టింగ్ కోరుకుంటున్నారో మరీ తెలుసుకుని కేటాయించారు.
తొలి రోజు అనుభవంతో..
మలి రోజు ప్రశాంతం
సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. తొలి రోజు (శనివారం) నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారి.. ఆందోళనలతో ముగిసింది. ఈ అనుభవంతో మలి రోజు (ఆదివారం) అధికారులు తీసుకున్న కొన్ని చర్యలు సాఫీగా సాగేలా దోహదపడ్డాయి. అభ్యర్థులందరినీ బయటే ఉంచి.. కొందరిని మాత్రమే అనుమతిస్తూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టడంతో తొక్కిసలాటకు తావు లేకుండా పోయింది. అయితే అర్ధరాత్రి వరకూ కౌన్సెలింగ్ కొనసాగినా ఇంకా అభ్యర్థులు మిగిలే ఉన్నారు.
లెటర్లు ఉన్న వారికే ప్రాధాన్యత..
ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారికే అధికారులు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చారా.. అయితే రండి. మీకు కావాల్సిన స్థానం కోరుకోండి అంటూ అడిగి మరీ వారికి సహకరించారు. మరి కొందరి విషయంలో ఎమ్మెల్యేలు నేరుగా ఫోన్లు చేసి పేర్లు సిఫారసు చేయడం గమనార్హం. జెడ్పీ క్యాంపస్లోని డీపీఆర్సీ భవన్లో డిజిటల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్ కొనసాగుతుండగా డీపీఓ నాగరాజునాయుడుకు తరచూ ఫోన్ కాల్స్ వచ్చాయి. అయినా ఆయన ఓపిగ్గా మాట్లాడుతూ కనిపించారు. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి ఓ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ర్యాంక్లో తొలి స్థానంలో ఉన్నా.. అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణ నుంచి ఓ అమ్మాయి లెటర్ తెచ్చుకున్నారు. ఒకే స్థానం కోసం ఇద్దరూ పోటీపడ్డారు. అయితే అప్పటికే ఆ స్థానం తొలి ర్యాంకర్ అబ్బాయికి కేటాయించగా.. అమ్మాయికి సర్దిచెప్పి మరో చోట అవకాశం కల్పించారు. అయితే ఏమాత్రం పలుకుబడి లేని వారు, ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చుకోలేకపోయిన వారు మదనపడ్డారు.
నిబంధనలకు వ్యతిరేకంగా
పశుసంవర్థక శాఖలో..
పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్కడి అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారని సచివాలయ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. కౌన్సెలింగ్కు ముందే అభ్యర్థులు మూడు స్థానాలను ఆప్షన్లగా చూపిస్తూ దరఖాస్తు చేసి ఉన్నారు. ఇందులో ఏదో ఒక స్థానాన్ని కౌన్సెలింగ్కు పిలిచినప్పుడు కేటాయించాల్సి ఉంటుంది. అయితే పశుసంవర్ధక శాఖలో మాత్రం మీరు ఏవైనా మూడు మండలాలు కోరుకొని ఆప్షన్లు ఇచ్చి వెళ్లండి. అందులో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తామంటూ’ ఉద్యోగులను వెనక్కి పంపడంపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి వరకూ కొనసాగిన కౌన్సెలింగ్..
ఉమ్మడి జిల్లా యూనిట్గా సచివాలయ ఉద్యోగులకు అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో మిగిలి ఉండడంతో అర్ధరాత్రైనా సరే పూర్తి చేయాలన్న పట్టుదలతో అధికారులు పని చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. చాలా చోట్ల కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు.
సచివాలయ ఉద్యోగుల కౌన్సెలింగ్లో అధికారుల తీరు
ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు ప్రాధాన్యం
ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా అధికారులకు ఫోన్ చేయించినా సరే
మంచి ర్యాంకు ఉన్నా సరే
దూరంగానే పోస్టింగ్
పలుకుబడి లేని ఉద్యోగుల పరిస్థితి దయనీయం
అధికారుల తీరుపై
సచివాలయ ఉద్యోగుల అసహనం

సిఫారసుకే పెద్దపీట