పామిడి/పుట్టపర్తి: అదనపు కట్నం కోసం తమ కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటూ బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు తెలిపిన మేరకు... పామిడిలోని ఎద్దులపల్లి రోడ్డులో నివాసముంటున్న కమ్మరి రామాచారి, పుష్పవతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కార్పెంటర్ వృత్తితో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో 9 నెలల క్రితం రామాచారి తన పెద్ద కుమార్తె శ్రావణి(25)ని శ్రీసత్యసాయి జిల్లా బుక్క పట్నం మండలం కృష్ణాపురానికి చెందిన గోవిందాచారి, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు నీలకంఠాచారికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద రూ.లక్షలు విలువ చేసే బంగారు, నగదు ఇచ్చారు. పెళ్లి అనంతరం నీలకంఠ కృష్ణాపురంలోనే వేరు కాపురం పెట్టాడు. వ్యవసాయంతో పాటు వేరుశనగ పప్పు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల వ్యాపారానికి సంబంధించి యంత్రాల కొనుగోలుకు డబ్బు అవసరం కావడంతో శ్రావణి తల్లిదండ్రులు నీలకంఠకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం శ్రావణిని నీలకంఠ వేధించడం మొదలు బెట్టాడు. తరచూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీనికి తోడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యసనాలు మానుకోవాలని భార్య పదేపదే చెప్పినా వినేవాడు కాదు. ఈ క్రమంలో తనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నీలకంఠాచారి పథకం ప్రకారం శనివారం రాత్రి నిద్రపోతున్న భార్య గొంతునులిమి హతమార్చి, అనంతరం ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనంతరం పామిడిలోని అత్తామామకు ఫోన్చేసి విషయం తెలిపాడు. అక్కడకు చేరుకున్న రామాచారి దంపతులు... తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్యగా నిర్ధారించుకుని నిలదీసేలోపు నీలకంఠాచారి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, పుట్టపర్తి డీఎస్పీ విజయ్కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అందే నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని డీఎస్పీ విజయ్కుమార్ పేర్కొన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా కృష్ణాపురంలో ఘటన
మృతురాలు పామిడి నివాసి కుమార్తె
కుటుంబ సభ్యులు నిలదీస్తుండగానే
భర్త పరారీ