‘అధికార’ అండ.. మట్టి దందా | - | Sakshi
Sakshi News home page

‘అధికార’ అండ.. మట్టి దందా

Jun 30 2025 4:27 AM | Updated on Jun 30 2025 4:27 AM

‘అధికార’ అండ.. మట్టి దందా

‘అధికార’ అండ.. మట్టి దందా

దొడగట్ట చెరువులో భారీగా మట్టి దోపిడీ

కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

డి.హీరేహాళ్‌(రాయదుర్గం): డి.హీరేహాళ్‌ మండలం దొడగట్ట చెరువులో కొద్ది రోజులుగా భారీఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. టీడీపీ నాయకుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తొలుత ట్రాక్టర్ల ద్వారా మట్టి రవాణా మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా జేసీబీలతో టిప్పర్లలోకి లోడ్‌చేసి పగలు, రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని సండూరు, రాంపురం, బళ్లారి తదితర ప్రాంతాల్లో ఇటుకల బట్టీలకు ఒక్కో ట్రిప్పు మట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ దందా వెనుక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి హస్తం ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా.. మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టిన దొడగట్ట చెరువును ఆదివారం రైతులతో కలసి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సందర్శించారు. అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దులో మార్తల్‌ వద్ద నిల్వచేసిన సుమారు వంద ట్రిప్పుల మట్టిని పరిశీలించారు. అక్కడి నుంచే కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, రాయదుర్గం రూరల్‌ సీఐ వెంకటరమణ, మైనర్‌ ఇరిగేషన్‌ డీఈకి ఫోన్‌ చేసి.. మట్టి అక్రమ రవాణాను సత్వరం అడ్డుకోవాలని కోరారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్నారు. ఇసుక, మట్టితో పాటు ప్రకృతి సంపద కొల్లగొట్టడమేనా సమర్థ నాయకత్వం అంటే అని ప్రశ్నించారు. మెట్టు వెంట స్థానిక సర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, నాయకులు ఎర్రగుంట కేశవరెడ్డి, మురడి మురళీమోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఎన్నికల హామీలను నెరవేర్చాలి

ఎస్‌యూసీఐ (సీ) కేంద్ర కమిటీ సభ్యుడు అమర్‌నాథ్‌

అనంతపురం టవర్‌క్లాక్‌: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కూటమి ప్రభుత్వాన్ని ఎస్‌యూసీఐ(సీ) కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన ఎస్‌యూసీఐ (సీ) జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను సీఎం చంద్రబాబు మభ్య పెట్టారని మండిపడ్డారు. అశాస్త్రీయ విధానాలతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములను కారు చౌకగా పెట్టుబడి దారులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో గ్రాఫిక్‌ డిజైన్లను ప్రదర్శిస్తున్నారన్నారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. శ్రమ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement