ఇక చూస్తూ ఊరుకొనేది లేదు | - | Sakshi
Sakshi News home page

ఇక చూస్తూ ఊరుకొనేది లేదు

Jun 30 2025 4:09 AM | Updated on Jun 30 2025 4:09 AM

ఇక చూస్తూ ఊరుకొనేది లేదు

ఇక చూస్తూ ఊరుకొనేది లేదు

అనంతపురం కార్పొరేషన్‌: ‘కూటమి ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. అందులో పోలీసు వ్యవస్థ ఒకటి. జిల్లాలో మద్యం మాఫియా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నా, అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోరు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు రక్షణ కల్పిస్తూ తాడిపత్రికి పంపాలి. లేని పక్షంలో ఎస్పీ కార్యాలయ ఆవరణంలోనే భారీ ధర్నా చేస్తాం’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు ఆది వారం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని బలవంతంగా తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న అనంత, మాజీ మంత్రి శైలజానాథ్‌, మాజీ ఎంపీ తలారి రంగయ్య, పార్టీ శ్రేణులు నగరంలోని పెద్దారెడ్డి క్యాంపు ఆఫీస్‌కు చేరుకుని ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘అనంత’ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపాలని ఈ ఏడాది ఏప్రిల్‌ 30న డీజీపీ, ఎస్పీలను హైకోర్టు ఆదేశించిందన్నారు. ఈ విషయమై తాము ఎస్పీ జగదీష్‌కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ నెల 25న ‘రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ అధిష్టానం ఆదేశించిందని, ఆ కార్యక్రమంలో భాగంగా తాడిపత్రిలోని తన సొంత ఇంటికి పెద్దారెడ్డి వెళ్లారన్నారు. అయితే, పెద్దారెడ్డి అక్కడ ఉండకూడదంటూ పోలీసులు బలవంతంగా అనంతపురం తరలించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారో లేదో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.హైకోర్టు, చట్ట ప్రకారం ముందుకెళ్తున్నారా.. లేక కూటమి ప్రభుత్వం, డీజీపీ ఆదేశాలతో ముందుకెళ్తున్నారా అని ప్రశ్నించారు. పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి బహిష్కరించారా అని పోలీసుల వైఖరిని దుయ్యబట్టారు.

ప్రభాకర్‌ రెడ్డికి ఎందుకంత భయం..

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లా పోలీసులు వ్యవహరిస్తుండడం అన్యాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనను తాడిపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తనను చూస్తే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఎందుకంత భయమో అర్థం కావడం లేదన్నారు. ‘నన్ను చూస్తే ప్రభాకర్‌ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుందా..’ అని ఎద్దేవా చేశారు. రాజకీయంగా వైఎస్సార్‌ సీపీ బలపడుతుందనే ఆలోచనతో వారున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, హైకోర్టును మరోసారి ఆశ్రయించి, వారి ఉత్తర్వుల మేరకే తాడిపత్రిలో అడుగుపెడతానని స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు తామూ అదే రీతిలో బుద్ధి చెబుతామన్నారు. ‘నేను రాజకీయాలు చేయకపోతే, అక్కడ ఉండలేకపోతే నువ్వు తాడిపత్రిని సరిహద్దుగా చేసుకుని ఉండాల్సి ఉంటుంది’ అంటూ జేసీ ప్రభాకర్‌ రెడ్డికి చురకలు అంటించారు. అనంతపురంలో ప్రభాకర్‌ రెడ్డిని అడ్డుకుంటామని, ఏది చేతనైతే అది చేసుకోవాలని పేర్కొన్నారు.

పెద్దారెడ్డిని పోలీసులే

తాడిపత్రికి తీసుకెళ్లాలి

లేకుంటే ఎస్పీ కార్యాలయం వద్ద

భారీ ధర్నా చేస్తాం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకటరామిరెడ్డి

పోలీసుల తీరుపై ధ్వజమెత్తిన

పార్టీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement