
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపైజేసీ కక్ష సాధింపు
● అధికారులను ఉసిగొల్పి
ఇంటికి కొలతలు
తాడిపత్రి టౌన్: ఆక్రమణల పేరుతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు రమేష్రెడ్డి, ఫయాజ్బాషాపై అధికారులను ఉసిగొల్పి వేధింపులకు పాల్పడిన ఆయన.. శనివారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైకి మున్సిపల్ అధికారులను ఉసిగొల్పారు. తాడిపత్రి పట్టణంలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దారెడ్డి ఇంటి పరిసరాలు, లోపల టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత కొలతలు వేసి రికార్డు చేశారు.
భారీ బందోబస్తు..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద మున్సిపల్ అధికారులు కొలతలు వేస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు.కేతిరెడ్డి ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రధాన కూడళ్లలో సిబ్బందిని మోహరించారు.
విధ్వంస పాలన..
జేసీ ప్రభాకర్రెడ్డి విధ్వంస పాలనకు తెరలేపాడని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. పట్టణ అభివృద్ధి గురించి మరిచి రోడ్లు కొడతా..సమాధులు కొడతా.. వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లు కొడతా అంటూ రోజూ అలజడి సృష్టిస్తున్నాడని దుయ్యబట్టారు. మొన్నటి వరకు తమ పార్టీ నాయకుల ఇళ్లను ధ్వంసం చేసి నేడు నా ఇంటికి కూడా కొలతలు వేయించారని విమర్శించారు. తాను చట్టానికి లోబడే ఉంటానని స్పష్టం చేశారు.
సచివాలయాల్లోనే
సబ్ డివిజన్కు రుసుం స్వీకరణ
అనంతపురం అర్బన్: ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ కింద దరఖాస్తు రుసు మును సచివాలయాల్లోనే సిబ్బంది స్వీకరించారు. దరఖాస్తు రుసుం స్వీకరించని అంశంపై ‘సాక్షి’లో ‘అమలుకాని ఆదేశాలు’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సబ్డివిజన్ కోసం వచ్చే రైతుల నుంచి దరఖాస్తు రుసుం స్వీకరించాలని సిబ్బందిని సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్ ఆదేశించారు. జేసీ ఆదేశాలను అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే రైతు కిష్టకు కొర్రపాడు–2 (బోడిగాని దొడ్డి) సచివాలయ సిబ్బంది ఫోన్ చేసి సబ్డివిజన్కు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
వీఆర్ఓలు, సర్వేయర్లకు నేడు బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్–2 వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా సచివాలయాల్లో 328 మంది గ్రేడ్–2 వీఆర్ఓలు ఉండగా ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 121 మంది ఉన్నారు. మొత్తం 130 ఖాళీలను చూపించారు. ఇక గ్రామ సర్వేయర్ల బదిలీలు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో జరగనున్నాయి.