ఢిల్లీలో శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్‌ | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్‌

Jun 29 2025 2:42 AM | Updated on Jun 29 2025 2:42 AM

ఢిల్ల

ఢిల్లీలో శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్‌

వజ్రకరూరు: ఢిల్లీలోని డాన్‌బోస్‌కో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో శనివారం ప్రారంభమైన ‘షీ రెప్రజెంట్స్‌–2025’ అనే ప్రతిష్టాత్మక నాయకత్వ అభివృద్ధి– శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్‌ మోనాలిసా హాజరయ్యారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డెమోక్రసీ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం కలిగిన 45 మంది మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో వజ్రకరూరు సర్పంచ్‌ మోనాలిసా ఒకరు. వీరికి ఏడు రోజులపాటు పాలన, కమ్యూనికేషన్‌, ప్రజానైతికత, నాయకత్వ నైపుణ్యాలు, సమస్యలు– వాటిపరిష్కార పద్ధతులు, పార్లమెంట్‌ సందర్శన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. మోనాలిసా మాట్లాడుతూ ఢిల్లీ శిక్షణకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు.

సిగ్నల్‌ లోపం.. ఆగిన రైలు

తాడిపత్రి రూరల్‌: కోమలి రైల్వే స్టేషన్‌లో అటోమేటిక్‌ సిగ్నల్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తి ధర్మవరం – మచిలీపట్టణం ఎక్స్‌ప్రెస్‌ గంటకు పైగా నిలిచిపోయింది. తాడిపత్రి రైల్వే స్టేషన్‌కు రాత్రి 7.24 గంటలకు రావాల్సి ఉండగా.. సిగ్నల్‌ లోపం కారణంగా 8.33 గంటలకు వచ్చింది. రెండు రోజుల క్రితం అటోమేటిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాడిపత్రి రైల్వే స్టేషన్‌లో అటోమేటిక్‌ సిగ్నల్‌ వ్యవస్థకు సంబంధించిన ప్యానల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. వారం క్రితం కోమలి రైల్వే స్టేషన్‌లో తెల్లవారుజామున ఒక దుండగుడు సిగ్నల్‌ వ్యవస్థకు సంబంధించిన వైర్లను తొలగించారు. సిగ్నల్‌ పడకపోవడంతో స్టేషన్‌ బయట నిలిచి ఉన్న రైలులోకి చొరబడిన దుండగుడు ప్రయాణికురాలు వనజాక్షి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతమైందన్న భయం ప్రయాణికుల్లో ఏర్పడింది. సిగ్నల్‌ వ్యవస్థలో ఏర్పడ్డ సాంకేతిక లోపం వల్ల రైలు నిలిచిపోయిందని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సిబ్బంది యుద్ధప్రాతిపదికన సిగ్నల్‌ వ్యవస్థను పునరుద్దరించి రైలును ముందుకు పంపించారు.

రైల్లో ప్రయాణికురాలి మృతి

గుత్తి: రైల్లో ప్రయాణిస్తున్న మహిళ హైషుగర్‌తో కుప్పకూలి మృతి చెందింది. జీఆర్‌పీ ఎస్‌ఐ నాగప్ప తెలిపిన మేరకు... బెంగళూరులోని యలహంకకు చెందిన లక్ష్మీబాయి (53) కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇటీవల పూరి యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని ‘పూరి ఎక్స్‌ప్రెస్‌’లో యలహంకకు బయల్దేరారు. గుత్తి రైల్వే స్టేషన్‌ సమీపంలోకి వచ్చినపుడు లక్ష్మీబాయి షుగర్‌ పెరిగిపోయి కుప్పకూలింది. కుటుంబ సభ్యులు ఎంత లేపినా లేవలేదు. అప్పటికే ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీబాయి మృత దేహాన్ని జీఆర్‌పీ పోలీసులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఢిల్లీలో శిక్షణకు  వజ్రకరూరు సర్పంచ్‌ 1
1/1

ఢిల్లీలో శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement