
వంకలనూ వదలని తమ్ముళ్లు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణా ఊపందుకుంది. ఈ క్రమంలో వాగులు, వంకలు, చెరువులు, రస్తాలను సైతం ఆక్రమించేస్తున్నారు. వంకలు, వాగుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
● బడా నేతల పేర్లతో బెదిరింపులు
● పట్టించుకోని అధికారులు
పెద్దవడుగూరు: ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సంపద సృష్టి అంశం దేవుడెరుగు కానీ, టీడీపీ నేతలు మాత్రం పేట్రెగిపోయి అక్రమార్జనపై దృష్టి సారించారు. పెద్దవడుగూరు మండలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగానే కనిపిస్తోంది. మండల పరిధిలోని క్రిష్టిపాడు, ఆవులాంపల్లి, కొండూరు గ్రామాల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు బరితెగించి మట్టి, ఇసుక దందాకు తెరలేపారు. ఇదేమని ప్రశ్నించిన అధికారులను బడా నేతల పేర్లు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఈ తలనొప్పి తమకెందుకు అనే ధోరణితో అధికారుల్లో ఉదాసీనత వ్యక్తమవుతోంది.
తగ్గు ప్రాంతాల చదును కోసమని
రెండు వారాల క్రితం తగ్గు ప్రాంతాలను చదును చేసుకునేందకు కొందరు రైతులు వంకల్లోని మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించే ప్రయత్నం చేశారు. ఈ డిమాండ్ను గుర్తించిన స్థానిక టీడీపీ కార్యకర్తలు వెంటనే మట్టి తరలింపులను అడ్డుకున్రాఉ. గ్రామాల్లో ఉన్న విబేధాలతో గొడవలకు తెరలేపారు. దీంతో రైతుల తమ పొలాలకు మట్టిని తరలించుకోవడం మానేశారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోయారు. మండల కేంద్రం నుంచి కొండుపల్లికి వెళ్లే మార్గంలోని గ్రామ శివారున ప్రధాన రహదారి పక్కన ఉన్న వంకలోని మట్టిని అక్రమంగా తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోసాగారు. జేసీబీలను పెట్టి మరీ మట్టి తవ్వకాలు చేపట్టడంతో రోజుల వ్యవధిలోనే వంకలో భారీ ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి.
దిక్కున్న చోటు చెప్పుకోండి
మట్టి అక్రమ తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే బడా నాయకుల పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసుల నుంచి అనుమతులు తీసుకున్నామని, దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకొండి అంటూ దౌర్జన్యానికి తెరలేపడంతో సామాన్యులు మాట్లాడలేకపోతున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా వంకలోని మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా వంకలో మట్టి తరలింపులు కొనసాగిస్తుండడంతో ఇప్టికే 15 అడుగుల లోతుతో, నాలుగు మీటర్ల వెడల్పుతో, సుమారుగా 20 మీటర్లకు పైగా పొడవునా భారీగా గోతులు ఏర్పడ్డాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెరువులు, వంకల్లో మట్టిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అనుమతులు ఇవ్వలేదు
పెద్దవడుగూరు మండలం నుంచి మట్టి, ఇసుక తవ్వకాలు, తరలింపులకు అనుమతులు ఇవ్వలేదు. నిబంధనలు ఉల్లంఘించి మట్టి, ఇసుక అక్రమ తరలింపులు చేపడితే వారిపై చట్ట పరౖమైన చర్యలు తీసుకొంటాం. మట్టి, ఇసుక తరలించాలంటే మైనింగ్ అండ్ జియాలజీ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
– ఉషారాణి, తహసీల్దార్, పెద్దవడుగూరు

వంకలనూ వదలని తమ్ముళ్లు