
పని ఒత్తిడి తగ్గించండి
అనంతపురం అర్బన్: పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలన్నారు. అన్ని రకాల సర్వేలు, స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్ను వసూళ్లు, పీఆర్ ఎన్యాప్, గ్రామ సచివాలయ సర్వేలు, రెవెన్యూ, పీజీఆర్ఎస్ పనులు, గ్రామ సభలు, గ్రామ పంచాయతీ సమావేశాలు, ప్రొటోకాల్ విధులు ఇలా పలు రకాలు పనులు పంచాయతీ కార్యదర్శులతో చేయిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ఇదే క్రమంలో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ఫిర్యాదులు వచ్చాయంటూ తమపై చర్యలు తీసుకుంటూ మరింత మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల్లో చాలామంది మహిళలు, వయసు పైబడిన వారు ఉన్నారన్నారు. వీరి గురించి అధికారులు ఆలోచించాలన్నారు. పంచాయతీ కార్యదర్శిని సచివాలయంలో జరిగే సంక్షేమ పథకాల సర్వే విధుల నుంచి తొలగించాలన్నారు. పీఎస్ లాగిన్కు సంబంధించి పీజీఆర్ఎస్ సమస్యలను ఆయా శాఖల వారికే కేటాయించాలన్నారు. పీఎస్ల అన్ని గ్రేడ్లలోనూ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి పారిశుధ్య పనులతో మొదలుకొని, గ్రామ, వార్డు సచివాలయ సర్వేలు మనమిత్ర, ఈ–కేవైసీ, ఎంబీయూ, జియో ట్యాగింగ్, బియ్యం కార్డు, తదితర వాటితో పాటు రోజూ రెండు లేదా మూడు వెబెక్స్, గూగుల్ మీటింగ్లు మరింత ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. ఇవి కాకుండా వాట్సాప్ మెసేజ్లు, స్ప్రైడ్షీట్, ఫొటోలు, వీడియోల అప్డేట్లు, ప్రజల మొబైల్ ఫోన్ నుంచి ఓటీపీ మెసేజ్ సేకరణ వంటి పనులు చేస్తున్నారన్నారు. ఇలా విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను, ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు భీమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటరాముడు, కార్యదర్శి రాఘవేంద్ర, సభ్యులు శివమూర్తి, శ్వేత పద్మిని, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.