
‘ఉపాధి’ అక్రమాలపై విచారణ చేపట్టాలి
అనంతపురం కార్పొరేషన్: ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి అక్రమాలపై విచారణకు, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ నెల 30 రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో జరిగే ‘ప్రజా సమస్యల పరిష్కారవేదిక’లో కలెక్టర్లకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. శనివారం ఆయన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం విడుదల చేసిన రూ.1150 కోట్ల పంచాయతీరాజ్ నిధులను సీఎం చంద్రబాబు ఇతర పనులకు బదలాయిస్తే.. ఎన్నికలకు ముందు మీ గొంతుకనవుతా.. ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సొంత శాఖకు చెందిన డబ్బులు ఇతర అవసరాలకు వాడితే గ్రామాభివృద్ధి ఎక్కడ సాధ్యపడుతుందని ప్రశ్నించారు. సర్పంచ్లకు ‘తల్లికి వందనం’ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 11 రద్దు చేసి.. 1,350 మంది పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్లు ఇచ్చి 10 నెలలుగా జీతాలు విడుదల చేయలేదన్నారు. గ్రామాల్లో వసూలు చేస్తున్న ఇంటి పన్నును స్థానిక సంస్థల ఖాతాల్లోకి జమచేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు యోగేందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కిరణ్, నాయకులు అంజన్రెడ్డి పాల్గొన్నారు.