కళ్యాణదుర్గం రూరల్: రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టమైన హామీనిచ్చిన చంద్రబాబు... అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కి విద్యుత్ చార్జీలను ఇష్టానుసారంగా పెంచుతున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయన్నారు.కళ్యాణదుర్గం కేంద్రంగా వెలుగు చూసిన ఈ–స్టాంప్ కుంభకోణం రాష్ట్ర మంతటా వ్యాపించి ఉంటుందని, ఆ దిశగా సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 5న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, కార్యదర్శి వర్గ సభ్యుడు సంజీవప్ప, నియోజకర్గ కార్యదర్శి గోపాల్, మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్