
విద్యార్థిని అప్పగిస్తున్న ఎస్ఐ రాజశేఖర్రెడ్డి
నార్పల: మండలంలోని కేసేపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి తప్పించుకుని పోయిన విద్యార్థి ఆచూకీని పోలీసులు పసిగట్టి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలను ఎస్ఐ రాజశేఖరరెడ్డి శుక్రవారం వెల్లడించారు. గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ కుమారుడు రేవంత్కుమార్ కేసేపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఉగాది పండగకు సెలవులు కావడంతో గత శనివారం ఉపాధ్యాయులకు తెలిపి స్వగ్రామానికని రేవంత్కుమార్ బయలుదేరాడు. సెలవులు ముగిసిన పాఠశాలకు రాకపోవడంతో బుధవారం ఉదయం యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తమ కుమారుడు ఇంటికే రాలేదంటూ తల్లిదండ్రులు తెలిపి, వెంటనే పాఠశాలకు చేరుకుని ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో కలసి అదే రోజు నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో యాడికిలోని అగాపే చర్చిలో ఉన్నట్లుగా తెలుసుకుని శుక్రవారం ఉదయం స్టేషన్కు పిలచుకువచ్చి తండ్రికి అప్పగించారు. విద్యార్థి పట్ల అశ్రద్ధ వహించిన పాఠశాల ఉపాధ్యాయులపై ఎస్ఐ రాజశేఖర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.