గుత్తి రూరల్: నకిలీ వే బిల్లులతో గుజరీ సామగ్రిని తరలిస్తున్న ఐదు లారీలను సేల్స్ ట్యాక్స్ అధికారులు ఆదివారం రాత్రి సీజ్ చేశారు. వైఎస్సార్ జిల్లా నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయానికి గుజరీ వస్తువుల లోడ్తో బయలుదేరిన ఐదు లారీలను గుత్తి మండలం కొత్తపేట శివారులో బైపాస్ వద్ద సేల్స్ ట్యాక్స్ అధికారులు అడ్డుకుని రికార్డులు పరిశీలించారు. అనంతపురం నుంచి సరుకు రవాణా చేస్తున్నట్లు రికార్డులు ఉంది. కాటా మాత్రం వైఎస్సార్ జిల్లా కడపలో వేయించారు. దీంతో ఐదు లారీలను సీజ్ చేసి గుత్తి పోలీసు స్టేషన్కు తరలించారు. ఒక్కో లారీకి రూ.1.80 లక్షలు చొప్పున ఐదు లారీలకు రూ.9 లక్షల మేర జరిమానా విధించారు.