పట్టించుకోని రెవెన్యూ అధికారులు
దేవరాపల్లి: తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు వీలుగా ఓ వ్యక్తి ఏకంగా ప్రభుత్వ భూమిలోనే అక్రమంగా రోడ్డువేస్తున్నాడు. మండలంలోని తామరబ్బపంచాయతీ శివారు కొండకొడాబు వెళ్లే రహ దారిలో మంచినీటి ట్యాంక్ పక్కన ఉన్న గోర్జులో విశాఖ నగరానికి చెందిన వ్యక్తి రోడ్డు నిర్మాణం కోసం వాహనాలతో వెట్మిక్స్ను (క్రషర్ బుగ్గి) వేయించడంతో పాటు కొండకొడాబు, జుత్తాపాలెం రెవెన్యూ పరిధిలో సుమారు రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి తలపడ్డాడు. ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తి రోడ్డు నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని, వారి అండదండలతోనే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటి కై నా రెవెన్యూ అధికారులు స్పందించి తక్షణమే ప్రభుత్వ గోర్జులో వేసిన వెట్మిక్స్ను తొలగించి, రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కె.అప్పారావును సంప్రదించగా ప్రభుత్వ గోర్జులో రోడ్డు నిర్మిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, తక్షణమే నిలిపివేయాలని సదరు వ్యక్తికి సూచించామని తెలిపారు.


