అనకాపల్లి: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురు, శుక్రవారాల్లో చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్టు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.వి. శ్రీనివాసరావు, ఆర్.శంకరరావు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. గతనెల రోజులుగా జిల్లాలో వివిధ పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు చెప్పారు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కార్మికులకు గత 15 సంవత్సరాలుగా జీతాలను సవరించకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని 30న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అంగన్వాడీ, ఆశ, వెలుగు వీవోఏ, ఆర్పీ, మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ ఆయాలు తదితర స్కీం కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆయా కార్మికులతో ఈనెల 31 చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.


