గొలుగొండ: దివ్యాంగ విద్యార్థికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వి. శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న నందిక అభిషేక్కు పూర్తి అంగవైకల్యం ఉన్నా సదరం క్యాంప్లో 14 శాతం సర్టిఫికెట్ మంజూరు చేయడంతో ఆ విద్యార్థి ఆవేదనపై సాక్షిలో ‘కలెక్టర్గారు మీరైనా స్పందించండి’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, రెవెన్యూ అధికారులు గ్రామంలో విచారణ జరిపి చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్కు వెళ్లి విద్యార్థి స్థితిగతులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వి.శ్రీనివాసరావు సాక్షితో మాట్లాడు తూ జిల్లా రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థి అభిషేక్ స్థితిగతులపై రెవెన్యూ సిబ్బంది విచారణ చేసి జిల్లా అధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు. ఆ విద్యార్థి ఆరోగ్యం, ఇతర పరిస్థితులపై విచారణ చేశామని తెలిపారు. విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులను విచారణ చేశామన్నారు. ముందుగా విద్యార్థికి హైస్కూల్కు ఎవరి సాయం లేకుండా వచ్చే విధంగా చిన్న వాహనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పూర్తి నివేదిక ఆధారంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో రాజుబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.


