అచ్యుతాపురం రూరల్ : చేనేత ఉద్యమ స్ఫూర్తిదాత, పద్మశాలి సమాజ ప్రముఖుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతిని ప్రతి ఏడాది జూలై 26 రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ పరిధిలోని శ్రీ భద్రావతి చేనేత కార్మికులు దుప్పితూరు సంఘం సభ్యులు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూరి అప్పారావు మాట్లాడుతూ చేనేత జాతి అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన ప్రగడ కోటయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.25వేల చేనేత భరోసా, ఉచిత విద్యుత్, ఆప్కో బకాయిల చెల్లింపు వంటి హామీలను వెంటనే అమలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వానపల్లి వెంకటరమణ, అముదూరి అప్పలరాజు, వానపల్లి ముకుంద ఈశ్వర్రావు, కాకి శ్రీనివాసరావు, సూరిశెట్టి సూరి వెంకటరమణ, వానపల్లి సన్యాసిరావు, శేశెట్టి రమణ, శీరం సత్తిబాబు చేనేత కార్మికులు పాల్గొన్నారు.


