అనకాపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణా శాఖ (ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు కోన లక్ష్మణ్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపో గేటు వద్ద శుక్రవారం ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీలో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు ఇప్పటికీ తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా అమలు కావడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నాయుడు, విశ్వేశ్వరరావు, వెంకట్, భగవాన్, హర్షవర్ధన్, పృథ్వీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


