కె.కోటపాడు: ఆర్లి ప్రాంతంలో 757 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత అన్నారు. ఆర్లి, చింతపాలెం, ఎరకన్నపాలెం గ్రామాలకు చెందిన రైతులతో బుధవారం ఆర్లి గ్రామంలో గ్రామసభను జరిపారు. ఈ గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత, అనకాపల్లి ఆర్డీవో ఆయిషా, తహసీల్ధార్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతు ఆర్లి రెవెన్యూలో 757 ఎకరాల భూమిలో జిరాయితీ, డి–పట్టాలతో కూడిన భూములు ఉన్నట్లు ఆమె తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబందించి భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షల నగదుతో పాటు 150 గజాల అభివృద్ధి చేసిన స్థలం ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో ఆయిషా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఫార్మా వంటి కంపెనీలు రావని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన పుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు వంటివి రానున్నట్లు ఆమె తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుపై ప్రజలు తెలిపిన వివరాలను ఆమె నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో వీఆర్వో శేషు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


