అనకాపల్లి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. స్ధానిక కలెక్టర్ కార్యాలయంలో పీఎం పోషణ్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం స్టీరింగ్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గవర్నమెంట్ పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు సరఫరా చేస్తున్న రైస్లో పురుగులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏడో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థినులకు సరిపడా శానిటరీ నాప్కిన్లను సకాలంలో అందజేయాలన్నారు. భోజన పథకంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు తగిన ఆరోగ్య పరీక్షలు సకాలంలో చేసి, రక్తహీనత కలిగిన విద్యార్థుల డేటాను యాప్లో పొందుపరచాలన్నారు. ఈ నెల 24న జరగబోయే మెగా పేరెంట్ మీటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.


