సబ్బవరం: ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రక్షణ పొందేందుకు రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై) కింద తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి సూచించారు. మండలంలోని అసకపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’కార్యక్రమంలో ఆమె రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున వరి రైతులు ఎకరాకు రూ.84 ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలన్నారు. పంట నష్టపోతే ఎకరాకు రూ.42 వేల వరకు పరిహారం పొందే అవకాశం ఉంటుందన్నారు. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని చెప్పారు. తక్కువ వ్యవధిలో కోతకు వచ్చే వరి రకాలను ఎంపిక చేసుకోవాలన్నారు. విత్తన శుద్ధి, నారుమడి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కె.ధనలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, ఏఈవో బాలరాజు, వీఏఏ అలేఖ్య, ఎంపీటీసీ అప్పారావు, మాజీ సర్పంచ్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి


