సింహాచలం: స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం శ్రీ నృసింహ హోమం విశేషంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఆలయ కల్యాణమండపంలో అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదికపై చక్రపెరుమాళ్లని వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపారు. పూజలో పాల్గొన్న భక్తులకు కంకణధారణ చేసి హోమగుండం వద్ద వేంజేపచేశారు. మండపారాధన, అగ్నిప్రతిష్ట, హోమం, పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. హోమంలో ఉంచిన ప్రధాన కలశంను అర్చకుడు శిరస్సుపై పెట్టుకుని తిరువీధిగా ఆలయంలోకి వెళ్లి స్వామివారి మూలవిరాట్కి సమర్పించారు. అనంతరం ఆ పవిత్ర జలాలను భక్తులపై జల్లారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.


