ఎస్.రాయవరం: వాటర్ బాటిల్ అనుకుని కెమికల్ వాటర్ తాగిన వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని దార్లపూడిలో జరిగింది. ఎస్.రాయవరం ఏఎస్ఐ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కై కలూరి గ్రామానికి చెందిన పిల్లనగ్రోవి సతీష్ (48) రెండు రోజుల క్రితం సోలార్ ప్లేట్లు ఏర్పాటుకు సిబ్బందితో కలసి దార్లపూడి వచ్చాడు. ఆ గ్రామంలోని ఓ ఇంట్లో సోలార్ పనులు చేపడుతున్నారు. ఆ క్రమంలో సతీష్ ఆదివారం రాత్రి ఆ ఇంట్లో టేబుల్ కింద బాటిల్లో ఉన్న కెమికల్ను నీళ్లు అనుకుని తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే అప్పటికే సతీష్ మృతి చెందాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు.


